నాగర్కర్నూల్, మే 17: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ఏటా 70వేల కోట్ల అప్పు అదనంగా వచ్చి చేరుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు. అకాల వర్షానికి నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీలించడానికి వచ్చిన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎకరానికి 50 నుంచి 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుండటంతోనే కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతు మెప్పు పొందేందుకు మద్దతు ధర ప్రకటిస్తుందే కానీ ధాన్యాన్ని కొనడం లేదని, కొనుగోలు అంతా రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దుతున్నదని ఆరోపించారు. ఐకేపీ ద్వారా మహిళా సంఘాలు కొనుగోలు చేస్తున్న ధాన్యానికి వెంటనే సదరు రైతుకు రసీదు ఇవ్వాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తన దృష్టికి వెంటనే ఆ సంఘాన్ని రద్దు చేస్తామన్నారు.