నకిరేకల్, మే 17 : జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే 676 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని లెక్కలు చెప్పారని, ఇప్పటికే 511 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, ట్రక్ షీట్ల ద్వారా 325 మెట్రిక్ టన్నులు మిల్లులకు వచ్చిందని మిల్లర్లు, 497 మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపించామని అధికారులు చెబుతున్నారని, అధికారుల లెక్కలకు, మిల్లర్ల లెక్కలకు, మంత్రులు, ఎమ్మెల్యేల లెక్కలకు పొంతనే లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దుయ్యబట్టారు. కేతేపల్లిలో ఆదివారం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, అధికారుల అలసత్వంపై చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరుమర్తి మట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకూ 50 శాతం కూడా కొనుగోలు చేయలేదన్నారు. మార్కెట్లోకి ధాన్యం వచ్చి 60 రోజులవుతున్నా ఏ ఒక్క రోజు కూడా అధికారులతో, రైసు మిల్లర్లతో మంత్రులు సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. గత రెండున్నరేండ్లలో లారీ యజమానులతో, మిలర్లు, అధికారులతో గానీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించకుండా తప్పుడు లెక్కలతో సమాచారం ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందని మంత్రులు లెక్కలు చెబుతున్నారని అన్నారు.
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 16 గంటలు, 14 గంటలు మాత్రమే ఇచ్చారని, కరెంటు ఇవ్వనప్పుడు పంట ఎక్కువ ఎలా పండుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులకు అండగా ఉండి అధికారులను నిలదీశారన్నారు.
అధికారుల్లో చలనం రాకపోవడంతో ఒత్తిడి పెంచడంతో బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుందని, ఏ పత్రికలో, చానళ్లలో చూసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనపడుతున్నారని, ఇటీవల నల్లగొండ కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగడంతో అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సివిల్ సప్లయ్ అధికారులను, మంత్రులను పిలిపించి ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, కేతేపల్లి, నార్కట్పల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మారం వెంకట్రెడ్డి, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, కొర్లపాడు సర్పంచి కొండేటి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు కొండ సాయి, ఏళ్ల అశోక్రెడ్డి, సోమయ్య, దండు వెంకటేశ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.