జమ్మికుంట : దళితులంటే బీజేపీకి పడదు. దళిత వ్యతిరేక పార్టీ అది. ఇగ ఈటలకు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు దళిత బంధును ఆపిచ్చిన్రు. అయితే ఏమైతది.. మరో వారం రోజుల్ల మళ్లీ దళిత బంధు గ్రౌండింగ్ అయితది. అందరికీ యూనిట్లు వస్తయ్. కానీ, ఇక్కడో విషయం తెలుసుకోవాలే.. మన కోసం పనిచేసే టోళ్లేవరు..? మనలను ఎదగనీయ్యకుండా చేసేదెవరు..? తెలుసుకోవాలి. ఆలోచించాలే.
దళితులు బీజేపీని తరిమి కొట్టాలే. ఇక్కడ స్థానం లేకుండా చేయాలే. 30న జరిగే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి దిమ్మదిరిగే గుణపాఠం చెప్పాలే. గెల్లు సీనును గెలిపించుకోవాలి..’అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.శుక్రవారం ఆయన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 11,12వ వార్డుల్లో ఎమ్మెల్యే నరేందర్తో కలిసి పర్యటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం ప్రచారం చేశారు. ఓటును అభ్యర్థించారు.
ఆయా కాలనీవాసులతో . ఇష్టాగోష్టి గా ముచ్చటించారు. టీఆర్ఎస్ లో ఈటలకు దక్కిన గౌరవం ఎవరికీ దక్కలేదని, పదవులన్నీ అనుభవించిన విషయాలను వివరించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల భూములు కొనుక్కుని, తన సమస్యను ప్రజలపై రుద్దారని దుయ్యబట్టారు. ఆస్తులు, అంతస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరాడని పేర్కొన్నారు. మంత్రిగా ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని, ఒక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రిగా అభివృద్ధి చేయని ఈటల, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఆయనకు గెలిచే అవకాశమే లేదని, పేదింటి బిడ్డ గెల్లు సీనునే గెలిపించుకుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ది, సంక్షేమం పరుగులు పెట్టిస్తామని, మరో రెండున్నరేళ్లు అధికారంలో ఉండేది టీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు.
బీజేపీ ఇక్కడ గెలిస్తే ప్రజలకు ప్రమాదమని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఈటల తన స్వార్థం కోసం రాజీనామా చేస్తే ఇక్కడ ఎన్నికలు వచ్చాయన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే హుజూరాబాద్ ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని తెలిపారు. గతంలో ఆరుసార్లు కారు గుర్తుకే ఓటేశారని, ఈ సారి కూడా కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలన్నారు. పనిచేసే సర్కారుకే ఓటేస్తే దళితులు ఉన్నతంగా బతుకుతారని పేర్కొన్నారు.
ధరలు పెంచుతూ పోతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. 30న గ్యాస్ సిలెండర్కు దండం పెట్టి కారు గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారం సందర్భంగా కాలనీవాసులు టీఆర్ఎస్ కే ఓటేస్తామని ప్రతినబూనారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. దళిత బంధు ఇచ్చిన సర్కారు వెంట నడుస్తామని హామీ ఇచ్చారు. ప్రచారాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు కళావతి, విజయలక్ష్మి, రాము, సారంగం, మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.