హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమరంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు కుట్రలకు తెరతీస్తున్నారని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం శ్రీహరి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వ్యవసాయరంగంలో రాష్ట్రం సాధించిన అసమాన ప్రగతిపై కన్నుకుట్టిన బీజేపీ నేతలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి ఒక విధానం అంటూ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, కానీ ఆ బాధ్యతను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి బడావ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. బడావ్యాపారుల రుణాలు రూ.10.86 లక్షల కోట్లను మాఫీ చేసిన ప్రధాని నరేంద్రమోదీకి రైతుల కోసం కనీసం లక్ష కోట్లు ఖర్చు చేయాలన్న ఆలోచన లేదని దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కొత్త ఒరవడి సృష్టించారని అన్నారు. అత్యంత సామాన్య కుటుంబా ల్లో పుట్టి, పేదరికంలో మగ్గి ఎదిగివచ్చిన ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన దార్శనికుడు కేసీఆర్ అని కొనియాడారు. పేదరికాన్ని పారదోలేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి మార్గదర్శనం చేస్తున్న పాలకుడిగా ప్రత్యేకత చాటుకున్నారని ప్రశంసించారు. జాతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణను ముందువరుసలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. చట్టసభలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతామని, సీఎం దిశానిర్దేశంలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు.
బండి నోర్మూసుకోవాలి
రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్న బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా నోర్మూసుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు ఫిబ్రవరి దాకా టైముందని చెప్పిన బండి సంజయ్కి వ్యవసాయంపై, పంటలపై కనీస అవగాహన లేదని తేలిపోయిందన్నారు. బండి సంజయ్ మాటలు నమ్మకూడదని రాష్ట్ర రైతాంగాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీకి ఒక విధానం అంటూ లేకపోవటం వల్లనే దేశం ప్రపంచ దేశాలతో పోటీపడలేకపోతున్నదని చెప్పారు. ఏడేండ్లకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా పడిపోయిందని, కరోనా సమయంలో మైనస్కు వెళ్లిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పరిపాలనాదక్షుడే అయితే ఈ దురవస్థ ఎందుకుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాలు అసూయపడే విధంగా అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఫలితంగా రాష్ట్ర జీఎస్డీపీ సగటు 9 నుంచి 10శాతానికి వృద్ధి చెందిందని చెప్పారు.