రాంచి: ముగ్గురు యువ డాక్టర్లు ఒక సరస్సు వద్ద పార్టీ చేసుకున్నారు. ఒకరి మొబైల్ ఫోన్ నీటిలో పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించే క్రమంలో ఇద్దరు జూనియర్ వైద్యులు సరస్సులో మునిగి మరణించారు. (Doctors Drown) జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంజీఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు చెందిన ముగ్గురు జూనియర్ డాక్టర్లు, జంషెడ్పూర్లోని దిమ్నా సరస్సుకు విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదకర ఆ ప్రాంతంలో వారు పార్టీ చేసుకున్నారు.
కాగా, ఒక వైద్యుడి మొబైల్ ఫోన్ ప్రమాదవశాత్తు సరస్సు తూము గేట్ల వద్ద నీటిలో పడింది. దీంతో దాని కోసం ఆ డాక్టర్ ఆ సరస్సులో దిగాడు. అతడు మునిగిపోతుండగా మిగతా ఇద్దరు డాక్టర్లు కాపాడేందుకు ప్రయత్నించారు. సరస్సు చాలా లోతుగా ఉండటంతో ముగ్గురు డాక్టర్లు మునిగిపోసాగారు.
అయితే ఈత వచ్చిన డాక్టర్ యష్ మాత్రమే ఆ నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆయన సహచరులైన డాక్టర్ సమీర్, డాక్టర్ సాక్షమ్ నీటిలో మునిగిపోయారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న వెంటనే డాక్టర్ యష్ తన సహచరులు, పోలీసులకు దీని గురించి సమాచారం ఇచ్చాడు.
మరోవైపు పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ఆ సరస్సులో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటలకు పైగా గాలించిన తర్వత ఇద్దరు డాక్టర్ల మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.