ఊట్కూర్ : ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Houses ) మంజూరులో మంత్రి సిఫారసు తప్పనిసరి చేయడంపై నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Utkoor ) మండల సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పావని అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక అధికారి, హౌజింగ్ పీడీ శంకర్ నాయక్ ( Shanker Nayak ) వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని చెబుతుంటే, మంత్రి సిఫారసు ఉంటేనే మంజూరు చేస్తామని ఎలా చెబుతారని సర్పంచులు నిలదీశారు. అధికారులు గ్రామాలకు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో సర్పంచులను పూర్తిగా పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి సిఫారసు లేకుంటే ఇల్లు రాదా అంటూ మక్దుంపూర్, కొత్తపల్లి సర్పంచులు తిరుమలేష్, నరసింహులు పీడీని నిలదీశారు. పూరిగుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల పేర్లను అధికారులు తీసుకున్నా, ఇళ్ల మంజూరులో ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది.
చిన్నపొర్ల సర్పంచ్ నికిత మాట్లాడుతూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని, వెంటనే ఉపాధ్యాయులను నియమించకపోతే పాఠశాలకు తాళం వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, తహసీల్దార్ అశోక్కుమార్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి, ఎంఈవో మాధవి, ఏవో గణేష్రెడ్డి, సర్పంచులు రేణుక భరత్, కతలప్ప, జయ ప్రకాష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజయ్య పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.