హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్లోఉండి దొడ్డు బియ్యం తిన్న అంటున్న ఈటల అనతికాలంలోనే వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు.
ఓటుకు రూ.5వేలతో పాటు మద్యం బాటిల్ పంచుతున్న బీజేపోళ్లు దొంగే దొంగ అన్నట్లుగా టీఆర్ఎస్ వాళ్లు రూ.20 వేలు పంచుతున్నారని దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు డబ్బులు పంచాల్సిన అవసరం లేదని, చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దళితబంధు గొప్ప పథకమని, ఆ పథకాన్నిచూసి టీఆర్ ఎస్లో చేరానన్నారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా కేసీఆర్ దళితుల భాగోగుల గురించి ఆలోచించారన్నారు.
దళితబంధు ప్రవేశపెట్టినందుకు కేసీఆర్కు దళితుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అబద్ధాలు ఆడ డం కాదని, దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రం నుంచి నిధులు తేవాలన్నారు. దళితుల భూములు 40ఎకరాల అక్రమంగా గుంజుకున్న ఈటలకు కచ్చితంగా ఆ పాపం తగులుతుందన్నారు. ఎన్ని పైసలు ఖర్చు పెట్టిన గెలిచేది కారు గుర్తేనని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికి దళిత బంధు పథకం లెక్కనే ఇరత కులస్తులకు సహాయం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
దళితబంధుపై అపోహలు వద్దు : ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
దళితబంధుపై అపోహలు వద్దని, బీజేపోళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే దళితులకు 90శాతం అకౌంట్ల్లో డబ్బులు ప్రభుత్వం జమ చేసిందన్నారు.
మాదిగల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ మాదిగలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పథకాన్ని బీజేపోళ్లు కుట్ర చేసి ఆపారని, ఎన్నికల తర్వాత ప్రతి వ్యక్తికి యూనిట్ గ్రౌండింగ్ జరుగుతుందన్నారు. గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులున్నారు.