వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడితోకలిసి ఘాతుకం
వీడిన పంజాగుట్ట బాలిక హత్య మిస్టరీ..!
అజ్మీర్లో నిందితులను పట్టుకున్న పోలీసులు
సిటీబ్యూరో/ఖైరతాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే నెపంతో ప్రియుడితో కలిసి కన్న కూతుర్నే హతమార్చింది ఓ కసాయి తల్లి. అందరూ దీపావళి సంబురాల్లో ఉండగా.. అభం శుభం తెలియని చిన్నారిని చితకబాది ఊపిరితీశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి రైలెక్కారు. పంజాగుట్టలో చోటుచేసుకున్న చిన్నారి హత్యకేసును ఛేదించిన పోలీసులు.. హత్యకు గల కారణాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. దీపావళి రోజు ఓ బాలిక మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ద్వారకాపురి కాలనీలో ఓ షెటర్ ముందు పడేసివెళ్లిన విషయం తెలిసిందే. మృతి చెందిన బాలిక ఎవరో? చంపిది ఎవరో? తెలియక వారం రోజులుగా ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా పంజాగుట్ట పోలీసులు నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. పక్క రాష్ర్టాలకు పోలీసు బృందాలను పంపించి ఎట్టకేలకు నింధితులను పట్టుకున్నారు. నిందితులు ఓల్డ్ సిటీకి చెందిన వారని తెలిసింది.
తండ్రి జైల్లో.. తల్లి వివాహేతర సంబంధం..?
ముఖ్య కూడళ్లలో భార్యాభర్తలు భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో కల్లు, మద్యం తాగి తిరుగుతుండే వారు. బాలిక తండ్రి ఓ దొంగతనం కేసులో సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. దీంతో ఆ బాలిక తల్లి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది.
తీవ్రంగా కొట్టడంతో.. ఊపిరాగింది..!
వారి వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డువస్తుందనే నేపంతో కొట్టేవారు. చివరకు దీపావళి రోజు ప్రియుడితో కలిసి తీవ్రంగా చితకబాదటంతో చిన్నారి ప్రాణం పోయింది. నగరవాసులంతా దీపావళి పండుగ సంబురాల్లో ఉండగా.. బాలిక మృతదేహాన్ని పంజాగుట్ట ద్వారకానగర్లోని ఓ షెటర్ ఎదుట పడేసి వెళ్లిపోయారు.
హత్యకు రెండురోజుల ముందే నగరానికి..!
బాలిక తల్లి, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి రైల్లో హత్యకు రెండు రోజుల ముందే బెంగళూర్ నుంచి నగరానికి వచ్చినట్లు సమాచారం. హత్య చేసి బాలిక మృతదేహాన్ని పడేసిన తరువాత రాజస్థాన్లోని అజ్మీర్ వెళ్లారు. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు. అలా కొన్ని ఆధారాలు లభించడంతో నిందితులను గుర్తించి, ప్రత్యేక బృందాలను బెంగళూరు, తమిళనాడు, రాజస్థాన్కు పంపించారు. అజ్మీర్లో శుక్రవారం నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. నిందితులను నగరానికి తరలించిన తరువాతే ఈ ఘటనపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు తాము ఏమి చెప్పలేమని పంజాగుట్ట పోలీసులు పేర్కొంటున్నారు.