షిమ్లా : హిమాచల్ప్రదేశ్లో కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి కిందభాగంలో ఉన్న నదిలో పడిపోయాయి. పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. అలాగే వంతెనతో పాటు వసతి గదులు కూలిపోయాయి. కిన్నౌర్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చిట్కుల్కు వెళ్తున్న సమయంలో పర్యాటకుల వాహనంపై బండరాళ్లు వచ్చిపడ్డాయి. తొమ్మిది మంది మృత్యువాతపడగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బండరాళ్ల ధాటికి నదిపై ఉన్న వంతెన సైతం కూలిపోయింది.
ఘటనలో తొమ్మిది మంది మరణించారని, బాట్రేరి వంతెన కూలిపోయిందని చీఫ్ సెక్రెటరీ అనిల్ ఖాదీ ధ్రువీకరించారు. మృతదేహాలను గుర్తించేందుకు, గాయపడిన వారికి అవసరమైన సహాయక సహకారాలు అందించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ప్రారంభించినట్లు డెప్యూటీ కమిషన్ అబిద్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన సీనియర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.15గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎత్తయిన పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు ఒక్కసారిగా కిందకు జారిపడ్డాయి. గతవారం నుంచి భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది.
Valley bridge Batseri in Sangal valley of Kinnaur collapses: Nine tourists from Delhi NCR are reported to be dead and three others are seriously injured pic.twitter.com/gTQNJ141v5
— DD News (@DDNewslive) July 25, 2021