బెంగళూరు : కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగిస్తారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో కన్నడనాట అర్ధ శతాబ్దానికి పైగా రాజకీయాలను శాసించిన ఆయన జీవితంలో ఆదివారం అత్యంత కీలకంగా మారనుంది. మరికొద్ది గంటల్లో సీఎం మార్పుపై అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నది. తన రాజీనామాపై విస్తృత స్థాయిలో వ్యాపించిన వదంతుల నడుమ యెడియూరప్ప ఓ కీలక ప్రకటన చేశారు. ‘సాయంత్రంలోగా పార్టీ అధిష్ఠానం నుంచి సందేశం వస్తే.. అదెంటో మీకు (మీడియా) తెలియజేస్తాను’ అని పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో అధిష్ఠానం నుంచి ఆదివారం అందే సూచనపైనే తన భవిష్యత్ ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఆయన అంచనా మేరకు పార్టీ పెద్దలు సీఎం మార్పుపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామాపై గత గురువారం సైతం ఆయన ఓ ప్రకటన చేశారు. అధిష్ఠానం నుంచి ఆదివారం అందే సూచనపైనే నా భవిష్యత్తు ఆధారపడుతందని ప్రకటించారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచిస్తే సోమవారం నిర్వహించే సర్కారు రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమంలో తన నిష్క్రమణపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది.
యెడియూరప్ప ఈ నెల మొదటల్లో ఢిల్లీలో పర్యటించారు. అక్కడ ప్రధానితో పాటు ఇతర సీనియర్ నేతలను కలిశారు. ఈ సమయంలో రాజీనామా చేయాలని తనను ఎవరూ అడుగలేదని యెడియూరప్ప పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం యెడియూరప్ప వరద ప్రభావిత జిల్లాల్లోని ఒకటైనా బెలగావిలో పర్యటించారు. కర్ణాటకలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతయ్యారు. ఇండ్లలోకి వరద చేరడంతో వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి తరలించారు.