టోక్యో: ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని అథ్లెట్లు ఏళ్ల కొద్దీ ప్రాక్టీస్ చేస్తారు. ఎంతో చెమటోడుస్తారు. కానీ ఆ విజయానికి చేరువగా ఉన్న సమయంలో ఓ సాంకేతిక లోపం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోతే ఎలా ఉంటుంటి? ప్రస్తుతం ఇండియన్ షూటర్ మను బాకర్ పరిస్థితి అలాగే ఉంది. ఆదివారం ఉదయం జరిగిన వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో తన పిస్టల్లో సర్క్యూట్ లోపం తలెత్తడంతో ఆమె ఫైనల్ చేరే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. తొలిసారి ఒలింపిక్స్లో ఆడుతూ అద్భుతంగా ప్రారంభించినా.. ఈ లోపం కారణంగా ఆమె ఐదు నిమిషాల పాటు నష్టపోయింది. ఇది ఆమె ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసింది.
క్వాలిఫికేషన్ రౌండ్ రెండో సిరీస్ సమయంలో మను బాకర్ పిస్టల్ ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్లో సర్క్యూట్ లోపం తలెత్తినట్లు ఆమె తండ్రి, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధికారి రామ్కిషన్ బాకర్ చెప్పారు. ఐదు నిమిషాల తర్వాత ఆ సమస్యను సరి చేసుకొని మళ్లీ ఫైరింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినా.. మళ్లీ ఆ ఫామ్ను అందుకోలేకపోయింది. తొలి సిరీస్లో 98 స్కోరు సాధించిన ఈ 19 ఏళ్ల వరల్డ్ నంబర్ టూ.. ఆ తర్వాత 95, 94, 95 స్కోర్లతో టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది. ఐదో సిరీస్లో మరోసారి 98 పాయింట్లతో టాప్ 8లోకి రావడానికి ప్రయత్నించినా.. ఆరో సిరీస్లో మూడు షాట్లు గురి తప్పాయి. చివరికి 575 స్కోరుతో 12వ స్థానంలో నిలిచి ఫైనల్కు దూరమైంది.