శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని బండిపోరాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారని కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్కుమార్ తెలిపారు. మృతుల్లో ఓ ఉగ్రవాది 2018లో అమృత్సర్లోని వాఘా సరిహద్దు నుంచి పాక్కు వెళ్లిన షకీర్ సైతం ఉన్నాడని పేర్కొన్నారు. ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారని పేర్కొన్నారు. బండిపోరా షోక్బాబా అడవుల్లో కొంత మంది ఉగ్రవాదులు ఉన్నారని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు.
వెంటనే అక్కడికి సైన్యం తనిఖీలు ప్రారంభించిందని, గమనించి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఓ జవాన్ గాయపడ్డారని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో స్థానిక ఉగ్రవాది షకీర్తో సహా ముగ్గురు మృతి చెందారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో జమ్మూలో బండిపోరాతో పాటు కుల్గామ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఓ జవాన్ గాయపడ్డాడు.