న్యూఢిల్లీ : 5జీ సేవలు అక్టోబర్ 12 నాటికి ప్రారంభమవుతాయని, ఆపై దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలకు 5జీ సేవలు విస్తరిస్తాయని టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్ గురువారం వెల్లడించారు. 5జీ సేవలను సత్వరమే ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ దిశగా ప్రయత్నిస్తున్న టెలికాం ఆపరేటర్లు ఇన్స్టలేషన్స్ చేపడుతున్నారని మంత్రి చెప్పారు.
అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని, ఆపై దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు ఈ సేవలు విస్తరిస్తాయని మంత్రి తెలిపారు. రాబోయే రెండు మూడేండ్లలో దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ చేరువవుతుందని అన్నారు. 5జీ అందుబాటు ధరలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని, నగర, గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవల లభ్యత కోసం పరిశ్రమ కసరత్తు సాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఇటీవల చేపట్టిన వేలం ద్వారా స్పెక్ట్రం కేటాయింపులకు గాను భారతి ఎయిర్టెల్, జియో, అదానీ డేటా నెట్వర్క్స్, వొడాఫోన్-ఐడియాల నుంచి టెలికాం శాఖకు రూ 17,876 కోట్లు సమకూరాయని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం టెలికాం ఆపరేటర్ల నుంచి రూ 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్ వచ్చాయి.