Zero Shadow Day : రేపు (ఏప్రిల్ 24న) కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక దివ్యమైన దృశ్యానికి సాక్ష్యంగా నిలువనుంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో దాన్నే ‘జీరో షాడో డే’ అంటారు. బెంగళూరులో రేపే ఈ ‘జీరో షాడో డే’. బుధవారం మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం కానుంది.
వస్తువులు, జీవులపై ఆ ఆరు నిమిషాలపాటు సూర్యకిరణాలు నిటారుగా పడుతాయి. దాంతో ఆ సమయం దేని నీడ దాని కిందే సరిగ్గా ఉండిపోతుంది. కాబట్టి బయటికి కనిపించదు. జీరో షాడో డే సందర్భంగా బెంగళూరులోని కోరమంగళ వద్ద ఉన్న క్యాంపస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఓ ఈవెంట్ నిర్వహించనుంది. నీడ కనిపించని ఆ కొన్ని క్షణాలను ఈ ఈవెంట్లో చూపించనుంది.
మధ్యాహ్నం వేళ సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో భూమిపై నీడలు కనిపించవు. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ కనిపించదో ఆ రోజునే ‘జీరో షాడో డే’గా ఆస్ట్రో నామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) పేర్కొంది. ఒక ప్రాంతంలో జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుందని ASI తెలిపింది. కర్కాటక, మకరరేఖల మధ్య ఉన్న అన్ని ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి సూర్యుడి కాంతి అక్షాంశానికి సమానంగా కొన్ని నిమిషాలపాటు ఉంటుంది. దాంతో ఆ కొన్ని నిమిషాలు నీడలు కనిపించవు.
సూర్యుడి చుట్టూ భూమి భ్రమించే క్రమంలో భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇదే రుతువుల మార్పునకు కారణమవుతుంది. సూర్యుడు అత్యంత ఎత్తులో అంటే నడినెత్తి మీదికి వచ్చినప్పుడు వస్తువులు, జీవుల నీడ కనిపించదు. 23.5 డిగ్రీలు వంగి ఉన్న భూ భ్రమణ అక్షం మీదికి సూర్యుడు ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో సమానంగా వస్తాడు. దీన్ని జెనిత్ పొజిషన్ అని కూడా అంటారు. మకర రాశి, కర్కాటక రాశి +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న సమయంలో ఇది జరుగుతుందని అస్ట్రోనామికల్ సొసైట్ ఆఫ్ ఇండియా (ASI) తెలిపింది.