KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే మే 10న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నీటివాటా అంశాన్ని జలశక్తిశాఖకు నివేదించాలన్నారు. ఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్లోను పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో పేర్కొన్నారు.
కృష్ణా నదిపై ఇరు రాష్ట్రాలకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయని, నీటి వాటా నిష్పత్తి తేలకుండా వాటికి జలాలను తరలించడం సాధ్యం కాదని తెలిపారు. కొత్త నీటి సంవత్సరం సైతం ప్రారంభమైందని, వీలైనంత త్వరగా ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలన్నారు. నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిగా భావించి ఆ ప్రాతిపదికనే ఇండెంట్ ఇస్తామని ఈఎన్సీ పేర్కొన్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, 2022-23లో అధిక నీటి వినియోగానికి సంబంధించిన అంశాన్ని సైతం జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును కోరిందని, ఎన్ని లేఖలు రాసిన ఎలాంటి స్పందన బోర్డు నుంచి లేదని పేర్కొన్నారు.