తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం. ఆ ఉద్దేశంతోనే మత్స్యశాఖ మహిళలకు కొత్తకొత్త వంటకాల తయారీలో శిక్షణ ఇస్తున్నది.
చేపల పులుసు. చేపల కూర. చేపల వేపుడు. చేపలతో ఏం వండినా అదుర్స్. ఇల్లయితే ఘుమఘుమలు, రెస్టారెంట్ అయితే కిటకిటలు, స్టాల్స్ అయితే ‘నో స్టాక్’ బోర్డులు! చేపల వంటకాలను ఉపాధిగా ఎంచుకోవాలనుకునే ఫిష్ప్రెన్యూర్స్కు మత్స్యశాఖ అండదండలు అందిస్తున్నది. చేపల వంటకాలతో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథమ్)తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ శిక్షణ పొందిన వారికి మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉపాధి మార్గాలను చూపిస్తారు. రాజేంద్రనగర్లోని నిథమ్ క్యాంపస్లో మత్స్య పాకశాస్త్రంలో పాఠాలు బోధిస్తారు. ఒక్కో బ్యాచ్లో 30 నుంచి 40 మంది చొప్పున మొత్తం 20 బ్యాచ్లలో సుమారు 700 మందికి శిక్షణ ఇస్తున్నారు.
పదిరకాల రుచులు..
మూడురోజుల శిబిరంలో చేపలు, రొయ్యలతో రుచి కరమైన వంటలు చేయడం నేర్పిస్తారు. ప్రత్యేకించి, పది రకాల రుచుల తయారీపై శిక్షణ ఇస్తారు. మార్కెట్లో తిరుగులేని ఆదరణ ఉన్నవాటినే శిక్షణ కోసం ఎంచుకున్నారు. నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలు.. తదితర అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తారు. శిక్షణ అనంతరం సబ్సిడీపై మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ సమకూరుస్తారు. ఇప్పటికే హైదరాబాద్లో 150 వరకు మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ ఏర్పాటయ్యాయి. రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాపుల్లో కూడా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కారు. ఆసక్తి ఉన్నవారు సంబంధిత జిల్లా మత్స్యశాఖ అధికారులను కానీ, హైదరాబాద్లోని మత్స్యశాఖ ఆఫీసులో కానీ సంప్రదించవచ్చు.