హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి వేదిక ఇప్పుడు మళ్లీ వేదికయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ ఒక్కటే తేడా. నాడు రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నేత. నేడు సాధించుకున్న రాష్ర్టానికి ముఖ్యమంత్రి. అప్పుడు ఆంధ్ర వలస పాలకుల వివక్ష నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం మహోద్యమం.. ఇప్పుడు తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా మరో పోరాటం. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీతో కయ్యం.
అప్పుడైనా, ఇప్పుడైనా ఆయనకు తెలిసింది ఒక్కటే.. అదే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. వీటి కోసం ఎంతకైనా తెగిస్తారు.. ఎంతవరకైనా పోరాడుతారు. నాడు తెలంగాణ కోసం కాంగ్రెస్ మెడలు వంచితే.. నేడు రైతుల కోసం బీజేపీ సర్కార్ మెడలు వంచేందుకు శంఖం పూరించారు. అధికారంలో ఎవరుంటే నాకేంటీ? నాకు నా ప్రజలే ముఖ్యమన్న తెగింపు.. ఉద్యమనేతగా పదేండ్ల కిందట ఏ జోష్తో ప్రసంగించారో.. నేడు ముఖ్యమంత్రిగా అదే జోష్తో చేసిన ప్రసంగం విన్నవారికి కేసీఆర్లో మళ్లీ ఒక ఉద్యమకారుడు కనిపించారంటే అతిశయోక్తి కాదు.
ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
అంశం : వరి పండించే రైతుల పట్ల కేంద్రం వివక్షపై సీఎం కేసీఆర్ ప్రసంగం
(రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టిన సందర్భమిది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్లో ఒకలాగా, తెలంగాణలో మరొక మాదిరిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.)
‘మేము ఏదైనా చేపడితే గమ్యాన్ని ముద్దాడే వరకు వదిలిపెట్టబోమని అందరికీ తెలుసు. రైతుల కోసం ఎంత వరకైనా వెళ్తాం.. కేంద్రం మెడలు వంచుతాం.. రైతులకు అండగా నిలబడుతాం.. ఇక యుద్ధమే.. అంతం కాదిది. ఆరంభం మాత్రమే’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
అంశం : సకల జనుల సమ్మెను ఉద్దేశించి ఉద్యమనేతగా ప్రసంగం
(సకల జనుల సమ్మె 29వ రోజు సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఉద్యోగుల సంఘాలు నిర్వహించిన మహాధర్నాను ఉద్దేశించి ఉద్యమ నాయకునిగా కేసీఆర్ ప్రసంగించారు. సమ్మెకు దిగిన ఉద్యోగులకు అప్పటి కాంగ్రెస్ సర్కారు వేతనాలు నిలిపేసిన సందర్భమది.)
‘ఎంతకైనా తెగించినోళ్లం.. జీతాలు ఆపితే భయపడుతామా? ఎక్కడ పోతాయి మా జీతాలు. రాష్ట్రం వచ్చాక జీతాలే కాదు.. కేంద్ర ఉద్యోగులతో సమానంగా పెంచుకుంటాం.. జై తెలంగాణ బోనస్సు ఇచ్చుకుంటాం.. ఈ ధర్నాలకే భయపడి ఎక్కడికక్కడే ఇక్కడికి (ఇందిరాపార్క్) రాకుండా బంధించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడతమా? రైల్రోకోలు చేస్తాం. పట్టాలపై కోట్లాది మందిమి పడుకుంటాం. ఎంతమందిని అరెస్టు చేస్తారో.. చూస్తాం.. అరెస్టు చేసిన వాళ్లను పెట్టడానికి జైళ్లు సరిపోతాయా?’ అని ప్రభుత్వంపై కేసీఆర్ సింహంలా గర్జించారు.
(నాడు చెప్పిన మాటలను అక్షరాలా అమలుచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు లభించేవిధంగా పీఆర్సీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు.)
మనదగ్గర యాసంగిలో ముడిబియ్యం సక్కగ రాదు. బియ్యం ముక్కలై నూక ఎక్కువొస్తది. ఇది మిల్లర్లకు నష్టం. కాబట్టి వాళ్లు కొనరు. మిల్లర్లు కొనకుంటే ప్రభుత్వం వడ్లు కొని ఏం చేసుకుంటది? చివరికి నష్టపోయేది రైతులే. కాబట్టి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే. – మంద శ్రీనివాస్రెడ్డి, ఖమ్మంపల్లి, కొండపాక మండలం (సిద్దిపేట)
మా భూమి చెరువు కిందనే ఉన్నది. ఎప్పుడూ నీళ్లుంటయ్. వరి తప్ప ఇంకోటి వేయలేం. ఇప్పుడు వరి వద్దు.. ఇంకో పంట వేయాలె అంటే ఎట్లా? ఫిబ్రవరిలో ఏమన్నా పంట ఏస్తే చేతికొస్తదా? – బానోత్ గోపాల్, బాబాయ్ చెరువు,
వీర్నపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల)
సీఎం కేసీఆర్ సారు ఇంత కష్టపడి, ఇంత కర్సుపెట్టి నీళ్లు తెచ్చిందెందుకు? వరి పండీయనీకే కాదా? మరి ఇప్పుడు కేంద్రం వడ్లు కొననంటే ఆ నీళ్లన్నీ ఏం చేసుకోవాలె. మా దగ్గర అడివి పందుల బెడద ఎక్కువ. వరి తప్ప ఏ పంటలు ఏశినా పందులు పాడుచేస్తయ్. నాకు ఐదెకరాల పొలం ఉన్నది. మొత్తం వరి వేస్తున్న. ఇప్పుడు కేసీఆర్ సారు వరి వద్దు.. ఇంకో పంట వేయాలని చెప్తే వేసేటందుకు సిద్ధంగా ఉన్న. – మహ్మద్ రఫీ, బంజేరు, (రాజన్న సిరిసిల్ల)
అందరూ వరి అంటే వడ్లు, బియ్యం మాత్రమే అనుకుంటుండ్రు. ఎయ్యకపోతే ఏమైతదని చాలా మంది అంటుండ్రు. మరి వరి లేకపోతే గోజలకు (పశువులకు) గడ్డి యాడికెల్లి వస్తది? వరి వేస్తే మనుషులతోపాటు మూగ జీవాలకు కూడా తిండి దొరుకుతది. అవి మన లెక్క ఏదిపడితే అది తినయ్. వాటికి పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఉండాల్సిందే. వడ్లు కొనం, వరి ఎయ్యకున్రి అంటే మనం ఏం తింటం? అనే ఆలోచన ఉండాలె కదా? – పెద్ద వెంకటయ్య, దంసాపూర్ (మహబూబ్నగర్)
వడ్లు కొంటరా? కొనరా అని కేంద్రం క్లియర్గా చెప్పాలె. కేంద్రంలో ఉన్నోళ్లు కొనమని చెప్తుంటే, రాష్ట్రంలో ఉన్న బీజేపోళ్లు వరి వేయాలని రైతులను మోసం చేస్తున్నరు. మేం సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. ఆయన పిలిస్తే ఎక్కడివరకైనా వెళ్లిపోరాడేందుకు సిద్ధం. మాకు బీజేపీ మీద ఆశలు పోయినయ్. నాతోపాటు మా దగ్గర రైతులు కూరగాయల వైపు మళ్లుతున్నరు. – సోమిశెట్టి ప్రవీణ్, 35వ డివిజన్ (వరంగల్)
ఒకప్పుడు నీళ్లు లేక ఏడ్శినం. సీఎం కేసీఆర్ సారు వచ్చినంక చెరువులల్ల, కాలువలల్ల నీళ్లు కనిపిస్తున్నయ్. బోర్లల్ల నీళ్లు వచ్చినయ్. ఎప్పుడంటే అప్పుటు పొలాలు పారించుకునేటందుకు ఫ్రీగా కరెంటు ఇస్తున్నరు. రైతుబంధు కింద పైసలు కూడా వస్తున్నయ్. పంటలు మంచిగ పండుతున్నయ్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నం అనుకుంటుండంగనే మళ్లా ఏడిపిస్తున్నరు. వరి కొనకుంటే ఏం చేయాల్నో అది చేస్తం. – సక్రి, వెంకటాపురం తండా,
కల్వకుర్తి (నాగర్కర్నూల్)