బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దొంగ పాదయాత్రలు చేస్తూ హిందువులను రెచ్చగొట్టడమే బీజేపీ లక్ష్యమని, తెలంగాణలో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పాతబస్తీ నుంచి పాదయాత్ర చేయడం వెనుక అసలు ఉద్దేశం అదేనని అన్నారు. బీజేపీది అధికార దాహం అని, కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ ఫలం అయిన చూపిస్తారా అని ప్రశ్నించారు. 18 రాష్ట్రాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని వ్యాఖ్యానించారు.
ఇక, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మంత్రి కొప్పుల ఎద్దేవా చేశారు. ‘మీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ది చేశారో చెప్పాలి. తెలంగాణ కోసం మేము రాజీనామా చేస్తే, బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు ముఖ్యం అయ్యాయి. కేటీఆర్, హరీశ్ రావును ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్లు రాజకీయాల్లోకి కొత్తగా రాలేదు’ అని కొప్పుల అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాబట్టే బండి సంజయ్, రేవంత్ రెడ్డి వారి పార్టీలకు అధ్యక్షులుగా పదవి పొందారని గుర్తుచేశారు.