హైదరాబాద్, జనవరి 24: తెలంగాణకు చెల్లించాల్సిన రూ.900 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్రానికి ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు. గతంలో చేసిన వినతులను కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన రూ.900 కోట్లు (రెండేండ్లకు సంబంధించినవి) రాష్ర్టానికి కేంద్రం బాకీ ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. వీటిని ఇవ్వటంతోపాటు ఈ గ్రాంట్ను 2021-22 ఆర్థిక సంవత్సరం తర్వాత మరో ఐదేండ్లు పొడిగించాలని కోరారు. నీతి ఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక సంస్థలకు రూ.817.16 కోట్లు చెల్లించాల్సి ఉన్నదన్నారు. వీటిలో గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రూ.315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.29 కోట్లు చెల్లించాలన్న ఆర్థిక సంఘం సిఫారసులను ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. కేంద్రం విధించిన షరతుల మేరకు వాటన్నింటినీ తెలంగాణ పూర్తిచేసినా నిర్దిష్ట కారణం లేకుండా ఈ నిధులను ఇవ్వడానికి కేంద్రం ఎందుకు తిరస్కరించిందని నిలదీశారు. 2019-20తో పోలిస్తే 2020-21లో తెలంగాణకు పన్నుల వాటా తగ్గుతున్నందున రాష్ర్టానికి రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో కేంద్రం వాటాను పొరపాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినా, ఇంకా సర్దుబాటు చేయలేదని వెల్లడించారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా వెంటనే సర్దుబాటు చేయాలని లేఖలో హరీశ్ కోరారు.