ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు
దేశానికి మార్గదర్శిగా హెల్త్ ప్రొఫైల్
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం హెల్త్ ప్రొఫైల్ ద్వారా మరోసారి దేశానికి మార్గదర్శకంగా మారబోతున్నది.
–ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 3 : ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా మారబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘పౌరులందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించే ఈ పైలట్ ప్రాజెక్ట్ను మార్చి 5న ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించారు. ఇది సత్ఫలితాల దిశగా పురోగమిస్తున్నది. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవటంలో దేశానికి తెలంగాణ మరోసారి టార్చ్బేరర్ అవుతుందని నేను విశ్వసిస్తున్నా.’ అని మంత్రి ట్వీట్ చేశారు. వ్యాధులు, రక్త పరీక్షలు, బరువు, ఎత్తు సంబంధిత వివరాలు డిజిటల్ చేయటం, తదనుగుణంగా రాబోయే రోజుల్లో వైద్యసేవలు అందించటం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
ఒక్కొక్కరికి 30 పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారికి ఈ హెల్త్ ప్రొఫైల్ నిర్వహిస్తారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా 30 ఆరో గ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరికి హిమోగ్లోబిన్, రాండమ్ బ్లడ్ షుగర్ తప్పనిసరిగా చే స్తారు. వీటి ఫలితాలను ‘ఈ హెల్త్’ మొబైల్ యాప్లో పొందుపరుస్తారు. వివరాలు చూసుకోవడానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు.. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలవుతున్నది. ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను గుర్తించడం.. రోగులకు మెరుగైన వైద్యం అందించడం, క్యాన్సర్ వం టి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరైన చికిత్సను అందించడం వంటివి జరుగుతాయి.