హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని స్పష్టంచేశారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రవేశపెట్టారు. మరో సభ్యుడు గంగాధర్గౌడ్ తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. కరు వు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. తలసరి విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో పండిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయని వివరించారు. దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టంచేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సాయం అందిస్తూ మేనమామలా మారారని అన్నారు.
స్వరాష్ట్రంలో 128 శాతం అభివృద్ధి రేటు
రాష్ట్రంలో ఉపాధి రంగం అభివృద్ధి చెందిందని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఐటీ రంగంలో రూ.2.55 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దాదాపు 7 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంతో ఆర్థిక వృద్ధిరేటు 128 శాతం పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 11.48 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.3.17 లక్షలుగా ఉన్నదని స్పష్టంచేశారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచెయ్యి
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచెయ్యి చూపారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రాష్ర్టానికి ఒక్క ఐఐటీ, మెడికల్ కాలేజీ ఇవ్వలేదని విమర్శించారు. 150 నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా ప్రకటించినా..అందులో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా జిల్లాకో మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేస్తున్నదని స్పష్టంచేశారు. గిరిజన వర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు ఆదరణ
దేశం చూపు తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ నాయకత్వం వైపు ఉన్నదని, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారని పల్లా తెలిపారు. అన్ని వర్గాల వారి కలలు నెరవేరుతున్నాయని, ప్రతిపక్షాల కలలు కల్లలవుతున్నాయని ఎద్దేవాచేశారు. దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ చేరిందని చెప్పారు. 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు రైతుబంధు పెట్టుబడిగా అందజేసిన ఏకైక నేత సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాన్ని చూసి ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చేరుతామని వినతులు పెట్టుకుంటున్నారని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశవ్యాప్తంగా ప్రజలు, రైతులు ఆకర్షితులవుతున్నా… రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం కండ్లు ఉండీ చూడలేకపోతున్నారని.. వారంతా ‘కంటివెలుగు’లో పరీక్షలు చేయించుకోవాలని పల్లా సూచించారు.