ప్రపంచంలోనే అపారమైన జలవనరులున్న దేశం మనది. ఎన్నో జీవనదులు వాటి ఉపనదులతో నిత్యం జలకళలాడుతూ కొన్ని వేల కిలోమీటర్లు పారుతూ ఉంటాయి. ఈ నీటిలో మనం వాడుకున్నన్ని వాడుకోగా.. ఇంకా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా మారి సముద్రంలో కలిసిపోతున్నాయి. జలవనరులను ప్రణాళికాబద్ధంగా వాడుకుంటున్న రాష్ర్టాలు అభివృద్ధిలో పురోగమిస్తుండగా, వృథా చేస్తున్న రాష్ర్టాలు కరువు కాటకాలతో అల్లాడుతున్నాయి. ఎనిమిదేండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన తెలంగాణది కూడా ఇదే పరిస్థితి. కానీ స్వరాష్ట్రంలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి.
హైదరాబాద్ సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల అమలుతో వ్యవసాయానికి సమృద్ధిగా నీరు లభిస్తుండగా, మరోవైపు భూగర్భజలాలు సైతం ఉబికి వస్తున్నాయి. ఫలితంగా తెలంగాణ రైతుల పంట దిగుబడి పెరిగి, లాభాలను సైతం ఆర్జిస్తున్నారు. కానీ దేశంలోని ఇతర రాష్ర్టాలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. అనేక రాష్ర్టాలను నీటి కొరత వేధిస్తుండగా, కొన్ని రాష్ర్టాలలో రైతులు సేద్యాన్ని వదిలి జీవనం కోసం ఇతర ఉపాధిమార్గాలను ఎంచుకుంటున్నారు.
దేశంలో అత్యంత తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాష్ర్టాల్లో గుజరాత్ ఒకటి. ఈ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో దీర్ఘకాలంగా నీటి సంక్షోభం నెలకొని ఉంది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా నర్మదా నది కాలువ ఒకదానిని కచ్ జిల్లాకు కేటాయించినా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. సిక్రా, దేవిసార్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ సాగునీరు లేక భూములు బీడువారి ఉన్నాయి. ఇక్కడి గ్రామాల్లోని రైతుల వద్ద వంద నుంచి 300 ఎకరాల భూములు ఉన్నాయి కానీ నీటి ఎద్దడి వల్ల 20 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అంజార్ తాలూకాలోని దేవిసార్ గ్రామంలో తాగునీటికి కూడా కొరత ఉండటంతో ప్రజలు దూర ప్రాంతాలకు నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
మధ్యప్రదేశ్లో సైతం దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. నర్మదా నది ఒడ్డున ఉన్న వందల సంఖ్యలో బోరుబావులు క్రమంగా ఎండిపోతున్నాయి. నర్మదాపురం జిల్లాలోని బిజన్వాడ, బంఖేడీ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటడం, బోరుబావులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత మూడేండ్లలో ఈ ప్రాంతంలో తాగునీటికి ఆధారమైన 600కు పైగా గొట్టపుబావులు ఎండిపోయాయని స్థానికులు తెలిపారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో సాగునీటితోపాటు తాగునీటికి కూడా ఎద్దడి నెలకొంది. రాష్ట్రంలోని సుమారు 69 పట్టణ స్థానిక సంస్థల్లో రెండుమూడు రోజులకొకసారి కూడా తాగునీరు సరఫరా కావడం లేదు. జాల్నా జిల్లాలోని బద్నాపూర్ మున్సిపాలిటీలో 15 రోజులకొకసారి సరఫరా అవుతున్నది. ఇక లాతూర్ జిల్లాలోని చాలా పట్టణాల్లో రోజువారీ నీటి సరఫరా బంద్ అయి చాలా కాలమైంది. 2016లో ఈ ప్రాంతానికి రైళ్ల ద్వారా నీటి సరఫరా జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలలో సాగునీటి కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ భుజల్ యోజనను అమలు చేస్తున్నప్పటికీ ఇక వేచి చూడటం తమ వల్ల కాదని ఆయా రాష్ర్టాల రైతులు చేతులెత్తేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంతో రాష్ట్రంలోని అన్నదాతలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేవలం మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంతోనే చేతులు దులుపుకోలేదు. మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి రాష్ట్రంలోని 24వేలకు పైగా చెరువులను పునరుద్ధరించింది. పలుచోట్ల ఇరిగేషన్ శాఖతోపాటు రోడ్లు, భవనాల శాఖ కూడా చెక్ డ్యామ్లు నిర్మించి నీరు వృథాకాకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో భూగర్భ జలాల మట్టం పెరిగి మెదక్, రాజన్న సిరిసిల్ల, షాబాద్ తదితర ప్రాంతాల్లో నీరు బోరుబావుల నుంచి బయటకు తన్నుకు వస్తున్నది.
ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విడుదలచేసిన ‘డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కంప్యూటెడ్ ఫర్ తెలంగాణ-2022’ నివేదిక ఎత్తి చూపింది. గత ఏడేండ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాల నీటిమట్టం 4.26 మీటర్లు పెరిగిందని ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని 83 మండలాల్లో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయిన, ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొంది. రాష్ట్రంలో వినియోగానికి సిద్ధంగా 680 టీఎంసీల భూగర్భజలాలు సిద్ధంగా ఉన్నాయని, ఇది కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన కేటాయింపులకన్నా రెండింతలు అధికమని వివరించింది. ఇదే నివేదిక 2020లో వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగణలో భూగర్భజలాల వినియోగం 65.45 శాతం నుంచి 53.32శాతానికి తగ్గిందని తెలిపింది. మిషన్ కాకతీయ వంటి నీటి సంరక్షణ చర్యల వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది.