MLA Prakash Goud | హైదరాబాద్ సిటీబ్యూరో,ఏప్రిల్20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు తనను ఆహ్వానించారని, కానీ పార్టీ మారే ఆలోచనే తనకు లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నారని వస్తున్న పుకార్లపై ఆయన పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్రెడ్డి నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, అయినా కార్యకర్తల అభీష్టమే తన అభిప్రాయమని, వారితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు పేర్కొన్నారు.
నాలుగు పర్యాయాలు తన గెలుపునకు అహర్నిశలు శ్రమించిన ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాలే తనకు ముఖ్యమని చెప్పినట్టు తెలిపారు. ఈ మేరకు మూడు మండలాల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలు సేకరించానని, వారిలో అత్యధిక శాతం మంది కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని తేల్చిచెప్పారని ప్రకాశ్గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా తాను నాయకులు, కార్యకర్తల మాటను జవదాటకుండా ఏ పార్టీలోకి వెళ్లబోనని చెప్పారు. ఈ నేపథ్యంలో తనపై అధికార పార్టీ పరోక్షంగా ఒత్తిళ్లకు పాల్పడే అవకాశం లేకపోలేదని, ఇందుకు నేతలు, కార్యకర్తల అండతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ వెల్లడించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.