Nama Nageswara Rao | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ‘ఈ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించే ధైర్యం కాంగ్రెస్కు ఉంటే.. రైతుల కన్నీటిని ఎందుకు తుడవడం లేదు.. వారి బాధను ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ప్రస్తుత ఖమ్మం పార్లమెంట్ స్థానం అభ్యర్థి నామా నాగేశ్వర్రావు.. ‘నేనొక రైతుబిడ్డగా చెప్తున్నా.. రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణణాతీతం’అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, పరిరక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు తెలంగాణ భవితను నిర్దేశించేవిగా అభివర్ణించారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, వీరిలో ఒకరు కేంద్ర మంత్రిగా చేసినా, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలున్నా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడింకా ప్రజల్లో ఆయనపై ఆదరాభిమానాలు పెరిగాయన్న ఆయన, ఎన్నికల ప్రచార సరళి, స్పందన తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’కు శనివారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ : ఎన్నికల ప్రచారం ఎలా సాగుతున్నది? ప్రజల స్పందన ఎలా ఉంది?
నామా: దాదాపు 25 రోజులుగా మా పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటివరకు 23 మండలాలను కవర్ చేశా. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులంతా తమ సమస్యలు చెబుతూ బాధపడుతున్నారు. రైతుబంధు ఇంకా అందరికీ రాలేదు. మాకు మేం చెప్పుకోవద్దు కానీ రైతుల్లో కేసీఆర్పై ఆదరణ, ఆభిమానం వారు సీఎంగా ఉన్నదానికంటే ఇప్పుడింకా పెరిగింది. ‘పదేండ్లపాటు మాకు ఏ కష్టం రాకుండా కేసీఆర్ చూసుకున్నారు. ఠంచనుగా రైతుబంధు వచ్చింది. పంట కొనుగోలు చేసి వారం తిరక్కముందే మా ఖాతాల్లో డబ్బులు పడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు’ అని రైతులు గుర్తుచేస్తున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ రైతుబంధు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచుతాం, రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసింది’ అని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులే కాదు, మహిళలకు నెలకు రూ. 2500 చెల్లిస్తామని, పింఛన్లు రూ.4వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కోపంతో ఉన్నారు. ‘ప్రజల్లో మేం ముఖం చూపకుండా అయింది’ అని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో మీ పార్టీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు.. ఆ ప్రభావం మీ ప్రచారంలో ఏమైనా కనిపిస్తుందా?
ఎలాంటి ప్రభావం లేదు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యం. కష్టపడే కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు. నాకన్నా ఎక్కువ కష్టపడి సమన్వయంతో పనిచేస్తున్నారు.ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు, ప్రజలు మారరని గత అనుభవాలు చెబుతున్నాయి. రైతుల కష్టాలు, ప్రభుత్వంపై వ్యతిరేకతను చూసి అనవసరంగా పార్టీ మారాననే భావన వారిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ ఎమ్మెల్యే సెగ్మెంట్ నా లోక్సభ పరిధిలోకి రాదు. అక్కడా ఆ ప్రభావం పెద్దగా ఉంటుందని నేను అనుకోను.
మాది జాతీయ పార్టీ.. మేం గెలిస్తేనే తెలంగాణకు మేలు అని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
అదంతా పచ్చి అబద్ధం. ఆ రెండు పార్టీల దగాకోరు మాటలకు నిదర్శనం. నలుగురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలతో రాష్ర్టానికి జరిగిన ప్రయోజనం ఏమిటో చెప్పమనండి. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలని, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మేం పార్లమెంట్ లోపలా బయటా అందోళన చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని మేం పట్టుబడితే మమ్మల్ని చూసి వెకిలిగా నవ్వారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం. నేను ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ రాష్ర్టాన్నే సాధించారు. తొమ్మిది మంది ఎంపీలతో లోక్సభనే స్తంభింపజేసి రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణగా నిలిచాం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉన్నది. గెలిచే అవకాశాలూ ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లానే పార్లమెంట్ ఫలితాలుంటాయని కాంగ్రెస్ అంటున్నది. ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. వీటిని మీరెలా చూస్తారు?
కాంగ్రెస్ పార్టీది మేకపోతు గాంభీర్యం. నాలుగునెలల క్రితం ఇంతకన్నా మెరుగ్గా ఉంటుందని ప్రజలు భావించారు. కానీ, అంతలోనే ఇంత అధ్వానంగా కూరుకుపోతామని ప్రజలెవరూ అనుకోలేదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని బాధపడుతున్నారు. బంగారం లాంటి కేసీఆర్ పాలనను కాదని ఇప్పుడు బాధపడుతున్నామనే భావన అన్ని వర్గాల్లో కనిపిస్తున్నది. నిజానికి రెఫరెండంగా స్వీకరించే ధైర్యం కాంగ్రెస్కు ఉంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా పట్టించుకోరా? డిసెంబర్ 9 నుంచే రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి 100 రోజులు పూర్తయినా చేయరా? రూ. 2 లక్షల రుణమాఫీకి రైతులు గడువు ఆడిగారా? మాకు రూ.4వేల పింఛన్ పెంచాలని ఎవరైనా అడిగారా? కానీ, ఇప్పుడు మొహం చాటేసింది ఎవరు? అసలు రుణమాఫీకి మేం 100 రోజుల గడువే పెట్టలేదని అనేవాళ్లెవరు? వారికి తగిన సమాధానం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
బలమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రం అనేది భారత సమాఖ్య స్ఫూర్తి. కానీ, బలహీన రాష్ర్టాలు, బలమైన కేంద్రం అన్న ధోరణి రోజురోజుకూ పెరుగుతున్నదనే వాదనకు ఓ సీనియర్ పార్లమెంటేరియన్గా మీ పరిశీలన?
ప్రపంచంలోని అనేక దేశాలకు అనేక రంగాల్లో మనం ఆదర్శం. అలాంటిది దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గడచిన పదేండ్లలో ఆ స్ఫూర్తిని క్రమంగా లేకుండా చేస్తున్నారు. రాష్ర్టాలు ఎంత బలంగా ఉంటే కేంద్రం అంత దృఢంగా ఉంటుంది. కానీ, గతంలో ఎప్పుడూలేనంతగా బీజేపీ ఆ స్ఫూర్తిని దెబ్బతీసింది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. రాష్ర్టాల చేతిలో ఏ అధికారం లేకుండా చేసి మొత్తం మేం చెప్పినట్టే వినాలి అనే ధోరణి కేంద్రంలో పెరిగిపోతున్నది. దీనికి ప్రాంతీయ పార్టీలే అడ్డుకట్ట వేస్తాయి. అలా అడ్డుకట్ట వేసే పార్టీలే ఉండకూడదనే భావనతో జాతీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాయి.
బీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో అధికారంలోకొచ్చేది ఉందా? ఆ పార్టీకి ఓటేయడం ఎందుకు? మాకు వేస్తే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. దీనికి మీరేమంటారు?
ఇంతకు ముందే చెప్పిన.. మళ్లీ మళ్లీ చెప్తున్న. కాంగ్రెస్కు ఓటేయకుంటే రాష్ట్రంలో అధికారం పోయేదేం లేదు. బీజేపీకి ఓటేయకుంటే ఆ పార్టీకి జరిగే నష్టమేం లేదు. కానీ, బీఆర్ఎస్కు ఓటేయకుంటే తెలంగాణకు మాత్రం కచ్చితంగా నష్టం జరుగుతుంది. పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు చించుకొని కొట్లాడింది బీఆర్ఎస్సే. కేసీఆర్ హయాంలో ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, బీసీ కులగణన, జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం. వాటికి నిధులు తెచ్చుకోవడం, వీటితోపాటు విభజన హామీల అమలు కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయగల సత్తా బీఆర్ఎస్కే ఉన్నది. గతం కంటే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఎక్కువ ఉండాల్సింది ఇప్పుడే.