హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. అందరి పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కానీ నిన్న మోదీ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను ఇవ్వడం లేదు. తెలంగాణ ఉద్యోగుల విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ హాయాంలో ఏర్పడ్డ రాష్ట్రాల్లో ఏం సమస్యలు లేవా? అని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల్లో కూడా విభజన సమస్యలు ఇంకా ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను కేంద్రం పరిష్కరించడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. విభజన సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉందన్నారు. మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఎన్జీవో అధ్యక్షుడు డిమాండ్ చేశారు. రేపట్నుంచి అన్ని జిల్లాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన తెలిపారు.