జోహానెస్బర్గ్, జూన్ 6 : దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు 12వ ‘తెలంగాణ అవతరణ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్బర్గ్లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, ఇతర భారతీయ సంస్థల ప్రతినిధులు, అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(TASA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా పిల్లల నృత్యాలు, పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సులేట్ జనరల్ కౌన్సిలర్ సుమతి రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఇలాంటి వేడుకల్లో ఇతర దేశాల్లో జరుపుకోవడం తెలంగాణకే గర్వకారణమన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, మురళి బండారు మాట్లాడుతూ..ప్రత ఏటా ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం.
ఇది మా మట్టికి మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ సమైక్యతకు, సాంస్కృతిక విలువలకు ఇదే ఉదాహరణ అని తెలిపారు. అలాగే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవానికి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.