బేగంపేట్, జనవరి 27: రెండు క్యాన్సర్లు సోకిన ఓ వ్యక్తికి కిమ్స్ దవాఖానలో రొబోటిక్ సర్జరీ నిర్వహించారు. నగరంలో ఫార్మా రంగంలో పనిచేస్తున్న చక్రవర్తి (36) అనే వ్యక్తి ఎక్యూట్ ప్రొమైలోసిటిక్ (రక్త క్యాన్సర్)తో బాధపడుతూ కీమోథెరపీ తీసుకొంటున్నారు. ఈ క్రమంలో అతనికి కామెర్ల వ్యాధి వచ్చింది. ఈ విషయం 2,3 నెలల తర్వాత తెలిసింది. సమస్య తీవ్రంగా ఉండటంతో బయాప్సీ చేయించగా పాంక్రియాటిక్ క్యాన్సర్ అని తేలింది. దీంతో అతడు చికిత్స కోసం కిమ్స్లో చేరగా వైద్యులు రొబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. కేవలం మూడున్నర గంటల్లోనే సర్జరీ పూర్తిచేశారు. ఇది దేశంలో అత్యంత వేగంగా జరిగిన రొబోటిక్ సర్జరీల్లో ఒకటని కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, రొబోటిక్ సర్జన్ మధు దేవరశెట్టి గురువారం వెల్లడించారు.