హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ జిల్లాల్లో రాష్ర్టానికి చెందిన జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారత విభాగం ఓవరాల్లో నిజామాబాద్ రెండోస్థానాన్ని దక్కించుకున్నది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్), వ్యర్థాల నిర్వహణలో సౌత్జోన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా రాష్ర్టానికి వివిధ క్యాటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు వరించాయి.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీ విజ్ఞాన్భవన్లో నిర్వహించే స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు కేంద్ర అదనపు కార్యదర్శి, స్వచ్ఛభారత్ మిషన్(జీ) డైరెక్టర్ వికాస్శీల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డుల కోసం ప్రతి అవార్డుకు 10మంది చొప్పున నామినేట్ చేసి పంపాలని, కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూడాలని లేఖలో సూచించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘పల్లెప్రగతి’ సత్ఫలితాలిస్తున్నది. ఉద్యమ తరహాలో పల్లెల రూపురేఖలను మార్చడంతో పరిశుభ్రంగా మారాయి. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులకు అదనంగా రాష్ట్రం నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది. ప్రతి గ్రామానికి ట్యాంకర్, వ్యర్థాల తరలింపునకు ట్రాక్టర్, ట్రాలీ మంజూరు చేసింది. డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణం, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్, రైతు వేదికలు, సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతోపాటు మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నారు. హరితహారంతో రాష్ట్రమంతా పచ్చదనం పరిఢవిల్లుతున్నది.
అవార్డులే కాదు.. నిధులూ ఇవ్వండి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి, మార్గనిర్దేశం వల్లే రాష్ర్టానికి అవార్డులు లభించాయి. స్వచ్ఛభారత్లో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. స్వచ్ఛభారత్ గ్రామీణ్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి అభినందనలు. అవార్డులు, రివార్డులతోపాటు తెలంగాణకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి.
– ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి