హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఒక రాష్ట్రం రెండుగా విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, ఇతర పంపకాలు లాంటి సమస్యలు సహజమని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ర్టాలు పరస్పరం సహకరించుకొంటున్నాయని తెలిపారు. కొన్ని సమస్యలు కోర్టుల్లో ఉన్నాయని, వీటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.
10 లక్షల మంది ఉద్యోగుల విభజన రికార్డు సమయంలో పూర్తి చేశామని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ర్టాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) 29వ సమావేశం ఆదివారం తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మహమూద్ అలీ హాజరై మాట్లాడారు. రాష్ర్టాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో జోనల్ కౌన్సిల్ కీలకంగా వ్యవహరిస్తున్నదని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, నేరాల కట్టడికి తీసుకొన్న చర్యలను వివరించారు.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఎవిడెన్స్ చట్టాలను మార్చాలని కేంద్రం నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు సమాలోచనలు జరిపి సలహాలు, సూచనలు ఇవ్వాలని అమిత్షా కోరారు. డ్రగ్స్పై కఠినంగా వ్యవహరించాలని, దర్యాప్తు వేగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలకు అనుబంధంగా రాష్ర్టాల్లో ఒక ఫోరెన్సిక్ సైన్స్ కాలేజ్ను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక భాషలో సిలబస్ను రూపొందించి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
బాలలపై జరిగే నేరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి 60 రోజుల్లోగా కేసును పూర్తి చేసేలా చూడాలన్నారు. నవంబర్ 15వ తేదీని కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్గావ్ దివస్గా ప్రకటించిందని, ఏటా వారంపాటు ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా దేశాభివృద్ధిలో, స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్రపై ప్రచారం చేయాలని కోరారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, పుదుచ్ఛేరి సీఎం రంగసామి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో తమిళిసై సౌందర్రాజన్, అండమాన్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషి, లక్షదీవుల పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్, కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్, తమిళనాడు విద్యా మంత్రి పొన్మూడి హాజరయ్యారు.
తెలంగాణ నుంచి ఏపీ డిస్కంలకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని జగన్ ఈ సందర్భంగా అమిత్ షాను కోరారు. తద్వారా తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్పై అమిత్ షా ఏ మాత్రం స్పందించలేదని సమాచారం.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆస్తుల విభజనకు నెల రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను అమిత్ షా ఆదేశించారు. రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తుల విభజన జరగాల్సి ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యలను జాతీయ అంశాలుగా పరిగణించి పరిష్కారానికి కృషి చేస్తామని అమిత్ షా చెప్పారు.
జోనల్ కౌన్సిళ్లు సూచనలకే పరిమితం కాకుండా రాష్ర్టాల మధ్య అనేక వివాదాలను, సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తున్నాయని ప్రశంసించారు. ‘దక్షిణాది రాష్ర్టా ల్లో పురాతన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు భారత సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ర్టాల పాత్ర గొప్పది. వాటి భాగస్వామ్యం లేకుండా దేశాభివృద్ధిని ఊహించలేం’ అని వ్యాఖ్యానించారు.
జోనల్ కౌన్సిల్లో తెలంగాణ చర్చించిన అంశాలు.. నిర్ణయాలు
బచావత్ కేటాయింపుల ఆధారంగా మిగులు జలాల వాడకానికి ఈ రెండు ఎత్తిపోతల పథకాలను ఉమ్మడి ఏపీలోనే చేపట్టారు. కృష్ణా జలాలు మహారాష్ట్ర, కర్ణాటకను దాటుకొని తెలంగాణ, ఏపీకి చేరుకుంటాయి. కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులకు కర్ణాటక అభ్యంతరాలు చెప్పే అవకాశం లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య జలాలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఆధారంగా కేటాయిస్తున్నారు. వీటి ఆధారంగానే తెలంగాణ ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టింది.
ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్లను కేఆర్ఎంబీకి జనవరి 15లోగా సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. పరిశీలన అనంతరం సీడబ్ల్యూసీ అనుమతులు మంజూరు చేస్తుంది.
ఈ బరాజ్ నిర్మాణంతో తమ భూములు మునుగుతున్నాయని కర్ణాటక చెప్తున్నది. ఈ సమస్యను అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు రెండు రాష్ర్టాల అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఈ నెల 11న కర్ణాటక ప్రభుత్వానికి లేఖరాశాం.
ఒక సంయుక్త అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఏపీ జెన్కో నుంచి తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్తుకు రాష్ట్రం రూ.3,442 కోట్లు చెల్లించాల్సి ఉండేది. తెలంగాణ విజ్ఞప్తులను, విభజన సమస్యలను ఏపీ పట్టించుకోకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 3న విత్డ్రా చేసుకొని, వెంటనే తెలంగాణ హైకోర్టులో 5న మరో పిటిషన్ వేసింది. లెక్కలన్నీ చూస్తే ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు రూ.4,457 కోట్లు కట్టాల్సి ఉంటుందని తేలింది. దీన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని కేంద్రం ఈ నెల 8న సూచించింది. అందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నది.
రెండు రాష్ర్టాలు చర్చించుకొని పరిష్కరించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ఏపీ భవన్ విభజనకు ఏపీ రెండు ప్రతిపాదనలు ఇచ్చింది. దీనిపై 2019 ఏప్రిల్ 28న రెండు రాష్ర్టాల సీఎంల సమావేశంలో చర్చించారు. 2019 అక్టోబర్ 9, ఈ ఏడాది ఏప్రిల్ 7న సైతం చర్చలు జరిగాయి. ఈ రెండు ప్రతిపాదనలపై తెలంగాణ అసంతృప్తిగా ఉన్నది. దీంతో మూడో ప్రతిపాదన సిద్ధంచేస్తున్నాం. త్వరలో ఏపీ ముందు ఉంచుతాం.
ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది.
షెడ్యూల్-9లోని 68 సంస్థలకు సంబంధించి తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో 23 సంస్థల ఆస్తులను ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీకి అప్పగించాం. వీటిని ఏపీకి అభ్యంతరాలు ఉంటే తెలంగాణ దృష్టికి తీసుకురావొచ్చు.
సుప్రీంకోర్టు 2016 మార్చి 18న ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా విభజన చట్టానికి సవరణలను ఏపీ కోరుతున్నది. సుప్రీం తీర్పు ఆధారంగా ఉన్నత విద్యామండలి ఆస్తుల విభజనకు కేంద్ర హోంశాఖ గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిని పాటించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో
నిర్ణయించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన వర్సిటీని నెలకొల్పాలి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 335 ఎకరాలను సిద్ధంగా ఉంచింది. 200 మంది విద్యార్థులకు తాత్కాలిక వసతి నిమిత్తం ములుగులోని యూత్ ట్రెయినింగ్ సెంటర్ను సిద్ధం చేశాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రూ.849 కోట్ల అంచనా వ్యయంతో సిద్ధం చేసిన డీపీఆర్ను కేంద్రానికి పంపాం. త్వరలో యూనివర్సిటీని స్థాపించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.