బూర్గంపహాడ్, ఏప్రిల్ 16 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేయడం అవివేకమని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అని, దేశ అత్యున్నత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసిన పవిత్ర ప్రక్రియను బ్రిటీష్ వారు మత ప్రాతిపదికన చేసిన దేశ విభజనతో పోల్చడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి..తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న వివక్షాపూరిత ఆలోచనా ధోరణికి అద్దం పడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని, దశాబ్దాల పోరాటం మూలంగా తెలంగాణ సాక్షాత్కరించిందని, తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన 8 మంది బీజేపీ, 9 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ సూర్య వ్యాఖ్యలను వెంటనే ఖండించాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు బీజేపీ ఎంపీ, బీజేపీ పార్టీ తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు.