Ghaziabad : ఉత్తర ప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక మురికి వాడలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 200 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ జిల్లా, ఇందిరాపురం పరిధిలోని కనవాని అనే గ్రామంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఒక మురికివాడలో 500 గుడిసెల వరకు ఉన్నాయి. అయితే, మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అన్నీ గుడిసెలే కావడం, చుట్టు కలప, ప్లాస్టిక్ వంటి పదార్థాలు ఉండటంతో మంటలు ఇతర గుడిసెలకు వేగంగా వ్యాపించాయి.
నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. అలాగే, ఆ గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 200 వరకు గుడిసెలు దగ్ధమైనట్లు అంచనా. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు, ఇతర రెస్క్యూ బృందాలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. కానీ, మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో వాటిని సులభంగా ఆర్పడం వీలుకాలేదు. దీంతో నోయిడాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అగ్నిమాపక వాహనాల్ని రప్పించారు. 22 ఫైర్ ఇంజిన్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ప్రదేశంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలను అదుపు తెచ్చేందుకు, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
A major fire broke out in the Kanawani slum area of Indirapuram, Ghaziabad, Uttar Pradesh, India.
According to information, the fire quickly spread to over 150 jhuggis (small huts where people live in very poor conditions), causing panic in the locality. https://t.co/Z9xUWhNWkq pic.twitter.com/B7m7kUvbSY
— Weather Monitor (@WeatherMonitors) April 16, 2026
దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా పొగ కనిపించిందని స్థానికులు అంటున్నారు. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ జరగలేదని తెలుస్తోంది. వందల మంది మాత్రం ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.