రేపు అన్ని సబ్జెక్టులకు కౌన్సెలింగ్
ఉపాధ్యాయులతో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 25: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా జిల్లా మారిన వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంతమంది ఉంటే అన్ని ఖాళీలు మాత్రమే చూపించబతాయని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో వీరారెడ్డి సమావేశమయ్యారు. మొత్తం 524 మంది ఉపాధ్యాయులు మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి వచ్చి రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తున్నదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఈహెచ్ఎస్, స్పౌజ్ సర్టిఫికెట్లను ఆదివారం మధ్యాహ్నం వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. స్పెషల్ కేటగిరీ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నవారు ఆదివారం మరోసారి ఆప్షన్ ఫారంతో సహా అందుకు సంబంధించిన సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా విజ్ఞప్తులను ఆదివారం మాధ్యాహ్నం వరకు స్వీకరించి మరోసారి కొత్తగా జిల్లా సీనియారిటీ సబ్జెక్టుల వారీగా అదేరోజు సాయంత్రం వరకు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించనున్నట్లు వీవారెడ్డి వెల్లడించారు. కౌన్సెలింగ్కు సంబంధించి ఎవరైనా అనుపస్థితి అయితే మిగిలిపోయిన ఖాళీల్లో ఉన్న స్థానాలు వారికి కేటాయించనున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఈవో నాంపల్లి రాజేశ్, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మధన్గోపాల్, కిఫాయత్ అలీ, శ్రీనివాస్, రఘు, వెంకటకృష్ణ పాల్గొన్నారు.