హాలియా, ఫిబ్రవరి 27 : దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర వస్తువులైన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేదల జేబులు కొడితే.. సీఎం కేసీఆర్ వివిధ రకాల సంక్షేమ పథకాలతో పేదల కడుపు నింపుతున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హాలియాలోని లక్ష్మీనర్సింహ గార్డెన్స్లో సోమవారం జరిగిన హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి, అభివృద్ధిపై నేడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు నేడు తెలంగాణ మాడల్, సీఎం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోనికి వచ్చాక రాష్ట్రంలో ఒక్క ఆకలిచావు కూడా లేదన్నారు. కానీ, దేశంలో నేటికీ 35 శాతం మంది ప్రజలు అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి సౌకర్యాలు కల్పిస్తుంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 6, 7 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు తప్ప సీబీఐ, ఈడీ, బోడీలకు భయపడడని అన్నారు. రామమందిరం పేరు చెప్పి హిందూ, ముస్లిం మధ్య చిచ్చు పెట్టి బీజేపీ 30 ఏండ్లపాటు రాజకీయం చేసిందన్నారు. కానీ, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని నొప్పించకుండా అందరినీ సమానంగా చూస్తున్నారని పేర్కొన్నారు.
జానారెడ్డి చేసిందేమీ లేదు..
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జానారెడ్డి చేసిందేమీ లేదని మంత్రి మండిపడ్డారు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 18 ఏండ్లు మంత్రిగా పని చేసినప్పటికీ రాజవరం మేజర్ కాల్వ చివరి భూములకు సాగునీరు కాదు కదా.. నాగార్జునసాగర్లో నివాసముండే ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేకపోయ్యారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధితో నాగార్జునసాగర్ నియోజకవర్గమే కాదు, నల్లగొండ జిల్లా, రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయని పేర్కొన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదని, ఆ పార్టీ భవిష్యత్లో అధికారంలోకి రావడం కల్ల అన్నారు. ఎమ్మెల్యే భగత్కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్ సహకారంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సుమారు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
భారీ ర్యాలీ..
హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా జవ్వాజి వెంకటేశం, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా హాలియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రామాలయం నుంచి లక్ష్మీనర్సింహ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాల నుంచి పార్టీ నాయకులు, శ్రేణులు భారీగా తరలిరావడంలో హాలియా రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, డీసీసీబీ డైరెక్టర్ ఇరిగినేని అంజయ్య, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, హాలియా, నందికొండ మున్సిపల్ చైర్మన్లు వెంపటి పార్వతమ్మ, కర్ణ అనూషారెడ్డి, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవినాయక్, సత్యపాల్, నరేందర్, చెన్నారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.