శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలోని నాలుగు చోట్ల డ్రోన్ కదలికలను గుర్తించినట్లు సాంబ ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ సోమవారం తెలిపారు. గత 56 గంటల్లో జమ్మూకాశ్మీర్ అంతటా డ్రోన్ల కదలికలను గుర్తించడం ఇది మూడోసారి. స్థానికులు లైట్లు మెరవడం చూసి సమీపంలోని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో వెంటనే బలగాలు భద్రతా చర్యలు చేపట్టాయి. ఆగస్ట్ 15స్వాతంత్య్ర దినోత్సవం, జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండో ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో డ్రోన్ల సంచారం కలకలం సృష్టిస్తున్నది.
ఇటీవల కాలాచక్ ప్రాంతంలో ఓ డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. జూన్లో జమ్మూలోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ల దాడి అనంతరం.. అప్రమత్తమైన బలగాలు లోయతో పాటు జమ్మూలో బలగాలు నిఘా పెంచాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు ఐఏఎఫ్ స్టేషన్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ను సైతం ఏర్పాటు చేశాయి. దాడి ఘటన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. తాజా డ్రోన్ల సంచారంపై భద్రతా బలగాలు ఇప్పటికీ స్పందించలేదు.