న్యూఢిల్లీ : ‘పెగాసస్’ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు, సిట్ విచారణ జరిపించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ‘పెగాసస్ స్పైవేర్’పై ప్రతిపక్షాలు కేంద ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ విషయమై కొద్ది రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. దీంతో సమావేశాలు సజావుగా సాగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.