Heat Wave | హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరో 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్లు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.
ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్లో 46.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8, నల్లగొండ జిల్లా తెల్దేవారపల్లెలో 46.7, నారాయణపేట జిల్లా ఉట్కూర్లో 46.4, నిజామాబాద్ జిల్లా జకోరాలో 46.4, మంచిర్యాల జిల్లా నాస్పూర్లో 46.3, పెద్దపల్లి జిల్లా ఈసల తక్కళ్లపల్లిలో 46.1, కామారెడ్డి జిల్లా ఏలుపుగొండలో 45.9, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లిలో 45.9, మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్లో 45.8, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.