న్యూఢిల్లీ : అనారోగ్య సమస్యలన్నింటికీ పోషకాహారమే సరైన పరిష్కారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపంతో ప్రొటీన్ల లేమి కారణంగా ఇతర వ్యాధులూ వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. శరీరం ఎక్కువ ఆహారాన్ని కోరుతోందంటే అధిక ప్రొటీన్లను శరీరం కోరుతుందనే అర్ధమని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
స్ధూలకాయంతో బాధపడే వారు ప్రొటీన్ ఆహారంతో సమస్యను అధిగమించవచ్చని పేర్కొంది. 46 ఏండ్ల సగటు వయసు కలిగిన 9341 మందిపై నేషనల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేపట్టిన అధ్యయన వివరాలను ఒబెసిటీ జర్నల్లో ప్రచురించారు. బ్రేక్ఫాస్ట్లో తగినంతగా ప్రొటీన్లు తీసుకోనివారు మిగిలిన రోజులో ఎక్కువగా తింటారని ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రొటీన్లు తక్కువగా తీసుకోవడంతో పాటు అధిక చక్కెర, ఉప్పుతో కూడిన ఆహారం, కొవ్వులు అధికంగా తీసుకోవడం స్ధూలకాయానికి దారితీస్తోందని పేర్కొంది.
ప్రొటీన్లు తక్కువగా తీసుకోవడంతో పాటు వీరు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్పై ఆధారపడటం అనారోగ్యాలకు కారణమవుతుందని పేర్కొంది. డైటరీ ప్రొటీన్లు కొరవడటం ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు పెంచుతున్నదని అధ్యయనం తెలిపింది. ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకోవడం శరీరంలో వాపు ప్రక్రియకు దారితీయడంతో పాటు పోషకాహారలోపం, తీవ్ర అలసట బాధిస్తాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవడం కీలకమని తేల్చిచెప్పింది.