పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసింది. పిచ్చి కుక్క దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అనారోగ్యం బారిన పడటంతో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చింది. అంబులెన్స్ దిగిన ఆ చిన్నారిపైకి సైతం పిచ్చి కుక్క వచ్చింది. దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పాప తండ్రిని కూడా తీవ్రంగా కరిచింది. అయితే గత కొంతకాలంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా దాడి చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినపన్పటికీ పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. నిన్న రాత్రి సమయంలో పిచ్చి కుక్క కరిస్తే.. ఆస్పత్రి ప్రాంగణంలో పడిన రక్తపు మరకలు శుభ్రపరిచేవారు కూడా లేరని మండిపడుతున్నారు.