Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 10.30 గంటలకు సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభంతో 73,800 దరిదాపుల్లో ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో 22,360 దగ్గర కొనసాగుతోంది.
సెన్సెక్స్-30 సూచీలో టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మారుతీ, సన్ఫార్మా, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
జేజీ కెమికల్స్ షేర్లు నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈరోజు రాత్రి అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు దానిపై దృష్టి సారించే అవకాశం ఉంది. మరోవైపు దేశీయంగా ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్ఠమైన 5.09 శాతానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెమ్మదించింది.
అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 82.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.73.12 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.