సుల్తాన్పూర్లో సహజానంద్ యూనిట్
15న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశీయ ఔషధ రంగానికి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్.. క్రమంగా వైద్య పరికరాల తయారీలోనూ సత్తా చాటుతున్నది. ఇకపై గుండె శస్త్రచికిత్సల్లో ఉపయోగించే స్టెంట్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులో ప్లాంట్ను నెలకొల్పిన ప్రఖ్యాత సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) స్టెంట్ల ఉత్పత్తిని చేపట్టేందుకు సిద్ధమైంది.
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 15న ఈ యూనిట్ను ప్రారంభించనున్నారు. దీంతో చైనా లాంటి దేశాల నుంచి స్టెంట్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరే చౌకధరకు లభిస్తాయి. రూ.250 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఎస్ఎంటీ యూనిట్లో ఏటా 12.5 లక్షల స్టెంట్లను తయారు చేయనున్నారు. తద్వారా దాదాపు 2,700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గుజరాత్కు చెందిన ఎస్ఎంటీ.. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ. దేశీయ మార్కెట్లో ఈ సంస్థ 30% వాటా కలిగి ఉన్నది.