సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న మాదిలకు సీఎం రేవంత్రెడ్డి ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వకుండా దగా చేశారని మండిపడ్డారు. రేవంత్ తన కుటుంబ సభ్యులకు టికెట్లు, పదవులు ఇప్పించుకున్నారని ఆరోపించారు.
అహంకారంతో కుటుంబ పాలనకు తెరలేపిన రేవంత్రెడ్డికి ఓటు ద్వారా బుద్ది చెప్పాలని వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. బీజేపీ పాలనలో దళితులపై అత్యాచారాలు, దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. దళితులను ఆలయాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న బీజేపీకి దళితులను ఓటు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఒడిశాలో జగన్నాథ ఆలయంలోకి రానివ్వలేదని, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని కోరారు.