ఐదేండ్లు ఎంపీగా పదవి వెలగబెట్టి అభివృద్ధికి ఐదు రూపాయల నిధులు తీసుకురాని బండి సంజయ్కు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆక్షేపించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ ఉద్యమ పంథాలో రాష్ర్టాన్ని సాధించి ఇక్కడి ప్రజల కలను సాకారం చేశారని అనిల్ కుర్మాచలం అన్నారు. అధికారం చేపట్టి తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపారని కొనియాడారు. కానీ అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఐదు నెలల్లోనే పాలనలో వైఫల్యం చెందిందని విమర్శించారు. మన రాష్ర్టానికి న్యాయం జరగాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించి ప్రగతి ప్రదాత, ప్రశ్నించే గొంతుకైనా వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు.