జమ్మికుంట : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటేసి పని చేసే ప్రభుత్వాన్ని మరింతగా పని చేసేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో విశేష స్పందన కనబడుతుందన్నారు. ప్రభుత్వం సాదించిన విజయాలను మాకంటే ముందే ప్రజలు వివరిస్తున్నారని చెప్పారు.
ఒక ఇల్లు కట్టాల్నంటేనే కనీసం రెండు, మూడేండ్లు పడుతుంది. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పూర్తి చేయించి రైతులకు అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. దాన్యం కొనుగోళ్లుచేయక పలు రాష్ట్రాల్లో రైతులు తమపంటరాశులకు నిప్పు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి గింజ వరకు అన్ని రకాల వడ్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఎర్పాటు చేయడం విశేషమని అన్నారు.