హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ అలుపెరుగని పోరాటానికి కేంద్రప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. గతంలో ఇచ్చిన టార్గెట్కంటే అదనంగా మరో 6 లక్షల టన్నుల బియ్యం (9 లక్షల టన్నుల ధాన్యం) తీసుకొంటామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంగళవారం లేఖ రాసింది. దీంతో ఈ వానకాలంలో మొత్తం 46 లక్షల టన్నుల బియ్యం (69 లక్షల టన్నుల ధాన్యం) సేకరణకు కేంద్రం అంగీకరించినట్టయ్యింది. వాస్తవానికి మొదట 60 లక్షల టన్నుల ధాన్యం సేకరణకే కేంద్రం అంగీకరించింది.
కానీ దిగుబడి 80 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉండటంతో మిగిలిన 20 లక్షల టన్నులు కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్రం అంగీకరించకపోవటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని మార్గాల ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం సేకరణపైనే తీవ్ర పోరాటం చేశారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్గోయల్ను కలిసి ధాన్యం సేకరణ పెంచాలని గట్టిగా పట్టుబట్టింది.
అడిగిందాంట్లో సగంకంటే తక్కువే..
అదనపు ధాన్యం సేకరణపై మొదట నోరు మెదపని కేంద్రం.. రాష్ట్రప్రభుత్వం, టీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు దిగొచ్చింది. అయితే, డిమాండ్ చేసిన దానిలో సగానికంటే తక్కువే తీసుకొనేందుకు అంగీకరించింది. దీంతో ధాన్యం సేకరణను కేంద్రం కూరగాయల బేరంలా మార్చేందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం మరో 20 లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కోరితే 9 లక్షల టన్నులకే అంగీకరించటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 62 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసింది.
ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు కుప్పలుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో వరి కోతలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన అదనపు టార్గెట్ చేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 7 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కూడా మరో 8-10 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయే అవకాశం ఉన్నది.