కామారెడ్డి : రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని 300 మంది లబ్ధిదారులకు మొదటి విడుత మంజూరైన రూ.లక్ష బీసీ బంధు చెక్కులను ఎమ్మెల్యే శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
60 ఏండ్లు పాలించిన ఏ ప్రభుత్వాలు జుక్కల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 9 ఏండ్లలో నియోజకవర్గంలోని 90 గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించుకున్నామన్నారు.
నియోజకవర్గానికి రూ.476 కోట్ల నిధులతో 40 వేల ఎకరాలకు సాగునీరు అందేలా నాగమడుగు లిఫ్టును సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో హన్మాన్ ఆలయం లేని ఊరు.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందని ఇల్లు లేదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మరోసారి సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు.