మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
సమస్యలు పరిష్కారం కాక.. ఇప్పుడు వారే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 317 జీవోపై సమీక్షించి భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా చేస్తామని మాట ఇచ్చి తప్పారని, బదిలీల క్యాలెండర్ ఇస్తామని, జర్నలిస్టులు, ఉద్యోగులకు అన్ని ప్రైవేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలువార్డుల్లో ప్రచారం నిర్వహించారు.