ఘట్కేసర్ రూరల్: దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం జరిగిన స్వామి వారి కళ్యాణ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ప్రతి ఒక్కరు సొంత ప్రయోజనాలతో పాటు సామాజిక సేవాకార్యక్రమాలను అలవర్చుకోవాలని సూచించారు. ఎదులాబాద్ గ్రామంలో శతబ్ధాల క్రితం వెలసి భక్తులు కోరిన కోరికలు తీర్చుతున్న ఇలవేల్పుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎదులాబాద్ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.
దేవాలయాలను అభివృద్ధి పర్చటంతో పాటు దీప, దూప, నైవేధ్యాలు నిత్యం ఉండేలా ప్రభుత్వం ఆలయ పూజారులకు వేతనాలు చెల్లించేలా చేసిందని చెప్పారు. స్వామి వారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు ఘట్కేసర్ మండలంతో పాటు పొచంపల్లి, బీబీనగర్, కీసర మండలాలతో పాటు జంటన నగరాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్, ఫిర్జాదీగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గ దయాకర్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్ చందర్ గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కందుల కుమార్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.