సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలువాలనే దృఢ సంకల్పంతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు నిరాశే మిగిలింది. తొలి మ్యాచ్ నెగ్గి ఆశలు రేపిన కోహ్లీసేన.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ను సఫారీలకు అప్పగించింది. రెండో ఇన్నింగ్స్లో పంత్ మినహా తక్కిన బ్యాటర్లంతా విఫలమైతే.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండో మ్యాచ్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంలో మన బౌలర్లు తడబడ్డారు. బోర్డు మీద చాలినన్ని పరుగులు లేకపోవడంతో పేసర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది!
కేప్టౌన్: అంచనాలు తప్పలేదు.. అద్భుతాలు జరుగలేదు! ఆఖరి టెస్టులో బ్యాట్తో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమ్ఇండియా బంతితోనూ ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక పరాజయం పాలైంది. నాలుగు రోజుల్లో మూగిసిన మూడో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. 212 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 101/2తో శుక్రవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. కీగన్ పీటర్సన్ (82), డసెన్ (41 నాటౌట్), బవుమా (32 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, శార్దూల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 210 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన 198కే పరిమితమవడంతో దక్షిణాఫ్రికా పని సులువైంది. తొలి ఇన్నింగ్స్లో 72, రెండో ఇన్నింగ్స్లో 82 పరుగులు చేసిన పీటర్సన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 223,
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210,
భారత్ రెండో ఇన్నింగ్స్: 198,
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 212/3 (పీటర్సన్ 82, డసెన్ 41 నాటౌట్; శార్దూల్ 1/22, షమీ 1/41).