అమరావతి : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదని కన్నతల్లిని చంపేశాడు ఓ కసాయి కొడుకు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 9వ తేదీన మధ్యాహ్న సమయంలో తల్లి నాగమణి (45) కొడుకు రాజబాబు భోజనం వడ్డించింది. తింటూ ఫ్రిడ్జ్ లోని నీళ్లు తెమ్మని తల్లిని అడిగాడు.
కాస్త ఆలస్యం కావడంతో రాజబాబు లేచి గట్టిగా అరుస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుండగా గుమ్మానికి గుద్దుకుని రాజబాబుకు గాయమైంది. దీంతో రాజబాబు విచక్షణ కోల్పోయి తల్లి తలను పూజ గదిలోని చెక్క బల్లకేసి బలంగా కొట్టి దాడి చేశాడు. గమనించిన స్థానికులు నాగమణిని కాకినాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.