సిటీబ్యూరో, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.
పనులు ప్రగతి దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు రూ. 450 కోట్ల విలువ గల బిల్లులు చెల్లింపులకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.103.19 కోట్ల విలువ గల బిల్లులు చెల్లించామని, మిగతా సుమారు రూ. 350 కోట్ల బిల్లులు చెల్లించేందుకు ప్రాసెస్లో ఉన్నట్లు చెప్పారు. వాటిని కూడా త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ సోమవారం స్పష్టం చేసింది.
నాలా పనులను ముందుగా మిషన్మోడ్లో అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, ఎడతెరపి లేని వర్షాలు పడటం మూలంగా కొంత ఆలస్యమైందని అన్నారు. అయినప్పటికీ చేపట్టిన నాలా పనుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం లేకుండా చేశామని చెప్పారు. ఈ సారి భారీ వర్షాలు కురిసినా పలు ప్రాంతాల్లో ముంపుముప్పు తప్పిందని తెలిపారు. అక్టోబర్లో 75 శాతం పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, మొత్తం పనులను డిసెంబర్ చివరి వరకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.